కొత్త పార్లమెంట్‌.. ఆసక్తికర విషయాలు!

10 Dec, 2020 05:59 IST|Sakshi

కొత్త పార్లమెంట్‌కు నేడు పునాదిరాయి

నేడు భూమి పూజ చేయనున్న మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పునాది రాయి వేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేశ్‌ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ తదితరులు పాల్గొంటారు. మొత్తం 200 మంది అతిథులు హాజరవుతారని అధికారులు చెప్పారు.

► 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  
► నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్‌ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించారు.
► త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని, పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.  
► ప్రస్తుత పార్లమెంట్‌ భవనంలో ఉన్న లోక్‌సభ, రాజ్యసభల కంటే ఇందులోని సభలు చాలా పెద్దవి. భవిష్యత్తు అవసరాల కోసమే విస్తీర్ణం భారీగా పెంచారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు సరిపడా చోటుంది.
► దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అంతర్గత అలంకరణ ఉంటుంది.  
► విశాలమైన సెంట్రల్‌ కాన్‌స్టిట్యూషన్‌ గ్యాలరీని సామాన్య ప్రజలు సందర్శించవచ్చు. 

మరిన్ని వార్తలు