తమిళనాట ట్విస్టులు.. పళనిస్వామి, పన్నీరు సెల్వానికి షాకిచ్చిన మోదీ!

28 Jul, 2022 07:30 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే వారి జాబితాలో మాత్రమే అన్నాడీఎంకే నేతలు పన్నీరు, పళని స్వామికి అనుమతి దక్కింది. కానీ, రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్‌ లభించలేదని సమాచారం. 

కాగా, అన్నాడీఎంకే అంతర్గత పోరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా వీరి మధ్య విబేధాలకు శుభం కార్డు పడే అవకాశం ఉంది.. అనే చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా మోదీని కలిసేందుకు అపాయిమెంట్‌ కోరినట్లు కూడా తెలిసింది. అయితే, ఈ ఇద్దరికీ మోదీతో ప్రత్యేక భేటీకి అనుమతి దక్కలేదు. చెన్నై విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే కార్యక్రమానికి మాత్రం ఈ ఇద్దరికి అధికారులు అనుమతిచ్చారు. ఢిల్లీ వెళ్లినా ప్రధానితో భేటీ కాలేకపోయిన నేపథ్యంలో   చెన్నైలోనైనా అవకాశం వస్తుందని ఎదురు చూసిన పళని స్వామికి ఇది పెద్ద షాకే అని భావిస్తున్నారు. అదే సమయంలో మోదీ ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించిన పన్నీరుకూ ఇది భంగపాటే.  

ఒకరిపై ఒకరు.. 
అన్నాడీఎంకే కార్యాలయం ధ్వంసం విషయంపై పన్నీరు సెల్వంను ఇరకాటంలో పెట్టేందుకు పళని స్వామి శిబిరం దూకుడు పెంచింది. ఈ కార్యాలయంలో రికార్డులు, కీలక వస్తువులు మాయమైనట్లు ఇప్పటికే ఆ శిబిరం వర్గాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ పళని మద్దతు ఎంపీ సీవీ షణ్ముగం డీజీపీ శైలేంద్ర బాబును కలవడం గమనార్హం. అదే సమయంలో  వీరి ఎత్తులకు పైఎత్తు వేయడానికి పన్నీరు సిద్ధమయ్యారు. తన కుమారుడు రవీంద్రనాథ్‌ను అన్నాడీఎంకే ఎంపీగా పరిగణించకూడదని పళనిస్వామి శిబిరం పార్లమెంట్‌ స్పీకర్‌కు లేఖ రాయడాన్ని పన్నీరు పరిగణనలోకి తీసుకున్నారు.

అదే సమయంలో పళని స్వామి వెంట ఉన్న 63 మంది ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే సభ్యులుగా పరిగణించకూడదని పేర్కొంటూ, వారిపై వేటుకు పన్నీరు సెల్వం వ్యూహ రచన చేస్తున్నారు. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్‌ అప్పావును కలిసి ఇందుకు లేఖ సమరి్పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక, అన్నాడీఎంకే కార్యాలయం తలుపులను కాలితో తన్ని పగలకొట్టిన వారి తొక్కి నలిపేద్దామని మద్దతు దారుల కు బుధవారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి పిలుపు నివ్వడంతో ఇద్దరు నేతల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది

మరిన్ని వార్తలు