పీఎం కిసాన్ రైతులకు తీపికబురు.. ఈ తేదీన ఖాతాలోకి రూ.2 వేలు!

29 Dec, 2021 19:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) యోజన పథకం కింద 10వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఏడాది జనవరి 1వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నట్లు పీఎంఓ తెలిపింది. ఈ పథకం కింద 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ.20 వేల కోట్లకు పైగా నిదులను బదిలీ చేయనున్నారు. 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి రైతు లబ్దిదారులతో సంభాషించనున్నారు. పీఎం-కిసాన్‌ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు, నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఏడాదికి రూ.6 వేల మేర ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఇంతవరకు మొత్తం 1.6 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నగదును రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది.

(చదవండి: ఆన్‌లైన్‌లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!)

మరిన్ని వార్తలు