వ్యవసాయ బిల్లుల ఆమోదాన్ని స్వాగతించిన ప్రధాని

18 Sep, 2020 15:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో శుక్రవారం వ్యవసాయ బిల్లులు ఆమోదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. దళారీల నుంచి రైతులను కాపాడే ఈ సంస్కరణలను విపక్షాలు వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుపట్టారు. దళారీలతో పనిలేకుండా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ సంస్కరణలు వెసులుబాటు కల్పిస్తాయని చెప్పారు. వ్యవసాయంలో రైతులకు నూతన స్వాతంత్ర్యం లభించిందని ప్రధాని కోసి రైల్‌ మెగా బ్రిడ్జిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన అనంతరం పేర్కొన్నారు. లోక్‌సభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు.

రైతులు తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా విక్రయించుకునేందుకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ బిల్లులు దళారీల నుంచి రైతులను రక్షిస్తాయని అన్నారు. ఈ అంశంపై రైతులను పక్కదారి పట్టించేందుక విపక్షాలు  ప్రయత్నించాయని మండిపడ్డారు. దశాబ్ధాల తరబడి దేశాన్ని పాలించిన వారు రైతుల సాధికారత కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. రైతుల లాభాలను దోచుకునే దళారీలకు విపక్షాలు సహకరించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

కాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. పంజాబ్‌ కాంగ్రెస్‌ ఎంపీల పార్లమెంట్‌ ఆవరణలోనే బిల్లు కాపీలను చించివేయగా, ఆ రాష్ట్ర రైతులు ఈనెల 24 నుంచి 26 వరకూ రైల్‌ రోకోకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శిరోమణి అకాలీదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నా పుట్టినరోజుకు ఆ గిఫ్ట్ కావాలి: మోదీ

మరిన్ని వార్తలు