జేఎన్‌యూలో విగ్రహావిష్కరణ చెయ‍్యనున్న మోదీ

12 Nov, 2020 15:29 IST|Sakshi

ఆందోళనలకు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘం

సాక్షి, న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని జేఎన్‌యూలోని అడ్మినిస్ట్రేషన్‌ భవనం వద్ద అవిష్కరించనున్నట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్ధి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) సాయంత్రం 5 గంటలకి నార్త్‌ గేట్‌ వద్ద ఆందోళన పిలుపునివ్వడంతో యూనివర్శిటీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను జేఎన్‌యూఎస్‌యూ అవిష్కరించింది. ఇప్పటికే జేఎన్‌యూ విద్యార్థులు విగ్రహ ఏర్పాటు అంశాన్ని మొదటి నుంచి  వ్యతిరేకిస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థులను దేశ విద్రోహులుగా అభివర్ణించిన బీజేపీ, ఆరెస్సెస్‌.. ఇప్పుడు వర్సీటీకి ఎందుకు వస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విగ్రహావిష్కరణ అనేది కేవలం నిధుల దుర్వినియోగమేనని  ఆరోపించారు.

2016లో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని, ఇప్పుడు రైతులు దేశమంతటా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుంటే స్వామి వివేకానందను అవమానించినట్టేనని తెలిపారు. మరో విద్యార్థి విష్ణు ప్రసాద్‌ మాట్లాడుతూ స్వామి వివేకానంద సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదని, కానీ ప్రాధాన్యతలను గుర్తించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జేఎన్‌యూని అనగదొక్కాలని చూస్తుందని ఆరోపించారు. విగ్రహాలకు పెట్టే ఖర్చు విద్యార్థులపై పడే భారాన్ని తగ్గించేందుకు వినియోగిస్తే బాగుంటుదని సూచించారు. 
చదవండి: (బెయిల్‌ ఇప్పించి నిరసనలా?)

ఈ కార్యక్రమంపై ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. జేఎన్‌యూలో జరగబోయే విగ్రహావిష్కరణ సాయంత్రం 6:30గంటలకి జరగనుందని తెలిపారు. దీనిపై మాట్లాడిన జేఎన్‌యూ వీసీ ఎం.జగదీష్‌ కుమార్‌ దేశంలో స్వామి వివేకానంద వంటి మేధావి, ఆధ్యాత్మిక నాయకుడు ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, యువతకు ఆయన స్పూర్తి కావాలన్నారు. దేశా నాగరికతను, సంప్రదాయలను గౌరవించాలని కోరారని తెలిపారు.

మరిన్ని వార్తలు