New Parliament Building: రోమాలు నిక్కబొడిచేలా.. నాలుగు సింహాల చిహ్నం

11 Jul, 2022 15:18 IST|Sakshi

New Parliament building.. దేశంలో కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవన నిర్మాణాన్ని అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. కాగా, ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. 

ఈ సందర్బంగా పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని(నాలుగు సింహాలతో) ఆవిష్కరించారు. కాగా, జాతీయ చిహాన్ని కాంస్యంతో తయారు చేశారు. 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

కొత్త పార్లమెంట్‌ భవనం స్పెషల్‌ ఇదే.. 
- కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఈ ఖర్చు 29 శాతం పెరిగి రూ. 1,250 కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. 13 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు, సాంస్కృతిక వైవిద్యం కొత్త పార్లమెంట్‌లో కనిపించనుంది.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు భవన నిర్మాణంలో పని చేస్తన్నారు. 

- ఈ ప్రాజెక్ట్‌ డిజైన్‌ను హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్) రూపొందించనున్నారు.

- కొత్త పార్లమెంట్‌ భవనంలోని ఆరు ప్రవేశ మార్గాలు ఉన్నాయి.
1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి,
2. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్‌పర్సన్, ఎంపీలు, 
3. సాధారణ ప్రవేశ మార్గం, 
4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం,
5,6. పబ్లిక్ ఎంట్రన్స్‌లుగా నిర్ణయించారు. 

కాగా.. లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు ఉండనుంది. రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు ఉండనుంది. భూకంపాలను సైతం తట్టుకునే విధంగా కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. 

మరిన్ని వార్తలు