వందే భారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇక దూసుకెళ్లడమే..

15 Jan, 2023 11:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఎనిమిదో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ.. పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకే ఈ వందే భారత్‌ రైలు. ఏపీ, తెలంగాణ మధ్య ఇక వేగవంతమైన ప్రయాణం కొనసాగుతుంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అంతా ఉత్సాహం నెలకొంది. వందే భారత్‌తో విలువైన సమయం ఆదా అవుతుంది.  మారుతున్న దేశ భవిష్యత్తులకు మందే భారత్‌ రైలు ఒక ఉదాహరణ. దేశీయంగా తయారైన వందే భారత్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటుగా రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది అని అన్నారు.

ఆగి ఆగి నడిచే రైళ్ల  నుంచి వేగంగా పరిగెత్తే రైళ్ళను తీసుకువచ్చాం. వందే భారత్ ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీక. 2023లో ప్రారంభించిన మొదటి రైలు ఇది.  గడిచిన ఎనిమిదేళ్లలో రైల్వే వ్యవస్థను సౌకర్యవంతమైన ప్రయాణంగా మార్చాం. ఇప్పుడు  రైల్లు ఆధునిక భారత్‌కు అద్దం పడుతున్నాయి.  విస్టా డోమ్ రైలు, కిసాన్ రైలు, హెరిటేజ్ రైలు నడుపుతున్నాం. 24 పట్టణాలలో కొత్తగా మెట్రో రైల్‌లను ఏర్పాటు చేస్తున్నాము. తక్కువ సమయంలో 7 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాము. తెలంగాణలో గడిచిన ఎనిమిదేళ్లలో అద్భుతమైన పనులు చేశాము. రైల్వేల కోసం గతంలో 250 కోట్లు కూడా ఖర్చు చేసేవారు కాదు. ఇప్పుడు మేము వేల కోట్లకు ఖర్చు చేశాము అని అన్నారు. 

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ పాల్గొన్నారు. కాగా, వందే భారత్‌ రైలు.. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడువనున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి వందే భారత్‌ రైలు.. ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరిమిత స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది. వందే భారత్‌ రైలు.. వరంగల్‌, విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ ప్రయాణం సాగిస్తుంది.

మరిన్ని వార్తలు