హీరాబెన్‌కు అనారోగ్యం.. తల్లి చెంతకు నరేంద్ర మోదీ

28 Dec, 2022 19:17 IST|Sakshi

అహ్మదాబాద్‌: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్‌ మోదీ దగ్గరకు వెళ్లారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురి కావడంతో అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమెను చేర్పించిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు కూడా. అయితే..

తల్లి అనారోగ్యం నేపథ్యంలో ఆమెను చూసేందుకు ఢిల్లీ నుంచి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లిన ఆయన.. సుమారు గంటపాటు తల్లితో గడిపారు. ఆరోగ్యంగా ఉండమని, అధైర్య పడొద్దని ఆమెకు సూచించారాయన. గుజరాత్‌ ఎమ్మెల్యేలు దర్శనాబెన్‌ వఘేలా, కౌశిక్‌ జైన్‌ సైతం ఆస్పత్రికి వెళ్లారు.

99 ఏళ్ల హీరాబెన్‌ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని అహ్మదాబాద్‌  యూఎన్‌ మెహతా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 

ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి తల్లి దగ్గరకు వెళ్లిపోవడం తగ్గినట్లు.. తరచూ ఆయన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ బాధపడడం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్‌ ఎన్నికల సమయంలో ఆయన ఆమె దగ్గరకు వెళ్లారు.  అంతేకాదు తన తల్లి వందవ పుట్టినరోజు కోసం ‘మదర్‌’ అనే బ్లాగ్‌ను సైతం ఆయన రాశారు.  

మరోవైపు నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ.. ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం మైసూర్‌(కర్ణాటక) వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరికీ స్వల్ఫ గాయాలు అయ్యాయి.

మరిన్ని వార్తలు