ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే?

9 Aug, 2022 17:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కవ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్‌లో గతంలో కొనుగోలు చేసిన భూమిని విరాళంగా ఇచ్చేశారు మోదీ. ఈ మేరకు తాజాగా వెల్లడించిన ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు మోదీ. మరోవైపు.. బాండ్స్‌, షేర్లు, మ్యూచ‍్యువల్‌ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టలేదు. సొంతంగా కారు కూడా లేదు. అయితే, సుమారు రూ.1.73 లక్షల విలువైన మూడు బంగారు ఉంగరాలు ఉన్నాయి. 

ఏడాదిలో రూ.26 లక్షల నుంచి రూ.2 కోట్లకు.. 
ప్రధాని మోదీకి చెందిన చరాస్తులు ఏడాది క్రితం 2021, మార్చి 31 నాటికి రూ.26.13 లక్షలుగా ఉండేవి. రూ.1.1 కోట్లు విలువైన స్థిరాస్తి ఉంటే దానిని విరాళంగా ఇచ్చారు. 2022, మార్చి 31 నాటి డిక్లరేషన్‌ ప్రకారం ప్రస్తుతం మోదీ వద్ద ఆస్తులు రూ.2,23,82,504 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసింది. 2022, మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,350 నగదు ఉంది. అలాగే పోస్ట్‌ఆఫీస్‌లోని నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫెక్ట్‌ విలువ రూ.9,05,105, జీవిత బీమా పాలసీల విలువ రూ.1,89,305గా ఉన్నాయి. 

‍ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేబినెట్‌ మంత్రులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వద్ద చరాస్తులు రూ.2.54 కోట్లు, స్థిరాస్తులు రూ.2.97 కోట్లు ఉన్నాయి. 29 కేంద్ర మంత్రుల్లో గత ఆర్థిక సంవత్సరంలోని తమ, తమపై ఆధారపడిన వారి ఆస్తుల వివరాలను వెల్లడించిన వారిలో ధర్మేంద్ర ప్రదాన్‌, జోతిరాదిత్య సింధియా, ఆర్‌కే సింగ్‌, హర్దీప్‌ సింగ్‌ పూరీ, పర్శోత్తమ్‌ రూపాలా, జీ కిషన్‌ రెడ్డి, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలు ఉన్నారు.

ఇదీ చదవండి: Akhilesh Yadav: నితీష్‌ రాజీనామా.. ‘బీజేపీ భగావ్’ అంటూ అఖిలేష్‌ షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు