సీతారాం ఏచూరి కొడుకు మృతి: ప్రముఖుల సంతాపం

22 Apr, 2021 12:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సీపీఎం సీనియర్‌ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి కుమారుడు మృతి చెందడం విచారకరం. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఇటీవల ఆశిష్‌కు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఆశిష్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీతారాం ఏచూరి ట్విటర్‌లో పేర్కొన్నారు.

ప్రముఖల సంతాపం 
సీపీఎం నేత సీతారాం ఏచూరి పెద్దకుమారుడి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబానికి సీఎం జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

► ఆశిష్‌ ఏచూరి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘డియర్‌ కామ్రేడ్ సీతారాం, మీ నుంచి ఆశిష్‌ దూరమైనందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్లిష్టమైన సమయంలో మా ఆలోచనలు మీకు, మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాయి’అని ఆయన ట్వీట్‌ చేశారు. 

► కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ సీపీఎం నేత సీతారాం ఏచూరి పెద్దకుమారుడి మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. ‘ఈ వార్త వినటం చాలా విచారకరం.తల్లిదండ్రులకు ఇంత కంటే పెద్ద నష్టం మరోటి ఉండదు.ఈ నష్టం పూడ్చలేనిది. దు:ఖాన్ని తట్టుకునే శక్తిని కలిగిఉండండి. ఈ బాధకరమైన సమయంలో నా హృదయం బరువెక్కింది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఆశిష్‌ ఏచూరి మృతి పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) నేత కవితా కృష్ణన్ విచారం వ్యక్తం చేశారు. ‘డియర్‌ కామ్రేడ్, ఈ విషాదం గురించి విని షాక్‌కు గురయ్యాము. మీకు, మీకు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఆమె ట్వీట్‌ చేశారు. 

► ఆశిష్‌ ఏచూరి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు.

మరిన్ని వార్తలు