నేడు పట్టాలపైకి డ్రైవర్‌ రహిత తొలి ట్రైన్‌

28 Dec, 2020 03:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్‌ రహిత ట్రైన్‌ సర్వీసు తొలిసారిగా మన దేశంలో పట్టాలెక్కనుంది. ఈ రైలు సర్వీసును ప్రధాని మోదీ 28న ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్‌ (జనక్‌పురి వెస్ట్‌ –బొటానికల్‌ గార్డెన్‌) లో డ్రైవర్‌ రహిత సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. దీనితోపాటు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌లో పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ సేవను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రారంభిస్తారు.

ఈ ఆవిష్కరణలు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో పాటు, రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని అధికారులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 7 శాతం డ్రైవర్‌లెస్‌ మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ జాబితాలో ఢిల్లీ కూడా చేరుతుందన్నారు. సోమవారం మెజెంటా లైన్‌లో డ్రైవర్‌లెస్‌ సర్వీసులు ప్రారంభమైన తరువాత, 2021 మధ్య నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల  పింక్‌ లైన్‌లో డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌ సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు