Bundelkhand Expressway: ఏంటిది? మోదీ ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేపై ఐదు రోజులకే గుంతలు..

21 Jul, 2022 19:14 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై పలుచోట్ల గుంతలుపడ్డాయి. బుధవారం కురిసిన వర్షం కారణంగా రోడ్డు పాక్షికంగా ధ్వంసమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల క్రితమే 296 కిలోమీటర్ల పొడవైన ఈ నాలుగు లైన్ల రోడ్డును ప్రారంభించడం గమనార్హం.

భారీ వర్షాల కారణంగానే సాలెంపుర్‌ చిరియా సమీపంలో ఈ రోడ్డుపై గంతలుపడిట్లు తెలుస్తోంది. దీనివల్ల బుధవారం రాత్రి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు కార్లు, ఓ మోటార్‌ సైకిల్ ప్రమాదాలకు గురయ్యాయి. ఔరేయాలోని అజిత్మాల్ మాల్ ప్రాంతంలోనూ రోడ్డు ఇలాగే దెబ్బతింది. అయితే ఈ ప్రాంతాల్లో మరమ్మతులు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు చెప్పారు.

ప్రతిపక్షాల విమర్శలు..
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఐదు రోజులకే గుంతలుపడటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. వర్షం వల్ల ఈ రోడ్డు అసంపూర్ణంగా ఉందనే విషయం ప్రజలకు తెలిసిందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.  డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ పనితీరు అంటే ఇదేనా.. వారం రోజులకే ఇలా అవుతుందా అని ఆమ్‌ ఆద్మీ పార్టీ సెటైర్లు వేసింది.

రూ.8000 కోట్ల విలువైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను జులై 16న ప్రారంభించారు మోదీ. నాలుగు లైన్ల ఈ రోడ్డును ఆరు లైన్లకు కూడా విస్తరించుకోవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్లోని ఏడు జిల్లాలు, మధ్యప్రదేశ్లోని 6 జిల్లాలకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే వ్యాపించి ఉంది.
చదవండి: మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్‌ పక్కా ప్లాన్‌! 300 యూనిట్ల ఉచిత కరెంటు, బకాయిల రద్దు హామీ

మరిన్ని వార్తలు