పంచెకట్టులో మోదీ.. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రధాని

19 Nov, 2022 16:33 IST|Sakshi

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ-తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. తమిళనాడు బీజేపీ చీఫ్‌ కె. అన్నామలై, సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాశీలో నేటి నుంచి నెల రోజులపాటు ఈ ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న పురాతన సంస్కృతి, శతాబ్ధాల జ్ఞానాన్ని పంచుకునే లక్ష్యంతో కాశీ-తమిళ సంగమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వంతో కలిసి యూపీ సర్కార్‌ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. 

ఈ కార్యక్రమలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన వారిని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతూ.. ‘సంగమం’ భారతదేశ విభిన్న సంస్కృతుల వేడుక అని అన్నారు. మన దేశంలోని నదుల సంగమం, జ్ఞానం, ఆలోచనల్లో  ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాశీ-తమిళనాడు సంగమం, గంగా యమునా సంగమం లాగే పవిత్రమైనదని తెలిపారు. కాశీ.. భారత దేశానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధాని అయితే తమిళనాడు.. దేశ పురాతన చరిత్రను కలిగి ఉందని వ్యాఖ్యినించారు.
చదవండి: బుల్డోజర్లతో కూల్చివేతలు.. కథలేమైనా ఉంటే ఆ డైరెక్టర్‌కి చెప్పండి.. సినిమా తీస్తారు!

ఇక కాశీలో 30 రోజుల పాటు తమిళనాడుకు చెందిన ద్ర‌విడ సంస్కృతి, సంప్ర‌దాయాల గురించి వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. త‌మిళ‌ వంట‌కాలు యూపీ ప్రజలకు పరిచయం చేయనున్నారు. త‌మిళ సంగీతం కాశీలో మారుమోగ‌నుంది. కాశీ త‌మిళ సంగ‌మం కోసం రామేశ్వ‌రం నుంచి ప్ర‌త్యేక రైలులో 216 మంది ఇవాళ వార‌ణాసి చేరుకున్నారు.  ఈవెంట్‌లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది త‌మిళ‌నాడు భ‌క్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు.


 

మరిన్ని వార్తలు