The Kerala Story: వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి మద్దతు తెలిపిన మోదీ.. చేదు నిజం అంటూ కీలక వ్యాఖ్యలు..

5 May, 2023 16:58 IST|Sakshi

బెంగళూరు: కేరళలో ప్రకంపనలు సృష్టించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఉగ్ర కుట్రల ఆధారంగా తీశారని, తీవ్రవాదానికి సంబంధించిన చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. కర్ణాటక బల్లారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసింగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.  ది కేరళ స్టోరీ చిత్రంపై తొలిసారి స్పందిస్తూ దానికి మద్దతు తెలిపారు.

'కొద్ది రోజులుగా ది కేరళ స్టోరీ చిత్రంపై పెద్ద చర్చ జరుగుతోంది. కేరళలో ఉగ్ర శక్తుల గురించి ఈ చిత్రం బహిర్గతం చేసింది. ఉగ్రవాదం గురించి తెలియజేసింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయల కోసం కాంగ్రెస్ ఉగ్ర శక్తులకు మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు ఉగ్రశక్తులతో ఆ పార్టీ గుట్టుగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి' అని మోదీ పేర్కొన్నారు.

కాగా.. ది కేరళ స్టోరీ చిత్రంపై సీఎం పినరయి విజయన్ సహా చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రం గురించి ఈ సినిమాలో తప్పుగా చూపించారని, కేవలం తమపై ధ్వేషంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని మండిపడ్డారు. కేరళవ్యాప్తంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేఫథ్యంలో గురువారం కొచ్చిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న పీవీఆర్‌ సినిమాస్.. షోను అర్ధాంతరంగా రద్దు చేసింది. మరోవైపు చిత్ర నిర్మాత, దర్శకులు మాత్రం  దీన్ని వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించామని చెబుతున్నారు.

కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయులు మతం మార్చుకుని సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇది పూర్తిగా అసత్యమని, విద్వేషంతో రూపొందించిన చిత్రమని కేరళ సహా దేశంలోని పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు.
చదవండి: శరద్‌ పవార్‌ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ

మరిన్ని వార్తలు