పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన మోదీ

13 Aug, 2020 11:50 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు 'పారదర్శక పన్నుల విధాన వేదిక' ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయి. సెప్టంబర్‌ 25 నుంచి ఫేస్‌లెస్‌ అప్పీల్‌ సేవలను ప్రారంభించనున్నట్లు మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు.

ద సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గతేడాది కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని వివరించింది. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మోదీ తెలిపారు.

మరిన్ని వార్తలు