కరోనా కేసులు పెరుగుతున్నాయ్ జాగ్రత్త.. ఈ ఏడాది చివరి 'మన్‌ కీ బాత్‌'లో మోదీ..

25 Dec, 2022 13:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర ఈ ఏడాది చివరి 'మన్‌ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. దేశ ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

2022 చివరి ఎపిసోడ్ కావడంతో ఈ ఏడాది భారత్ సాధించిన మైలురాళ్ల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను ఈ ఏడాది అధిగమించినట్లు చెప్పారు. ఏ ఏడాదే జీ-20కి భారత్ నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం వేడుకల్లో భాగంగా నిర్వహించిన హర్ గర్ తిరంగా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు.

ఆధునిక యుగంలో యోగా, ఆయుర్వేదానికి ప్రాధాన్యం పెరగడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగులపై యోగా  ప్రభావవంతంగా ఉందని  టాటా రీసెర్చ్ సెంటర్ చేసిన పరిశోధనను కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయుర్వేదాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను సహకరించాలన్నారు.

అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినెల చివరి ఆదివారం మోదీ మన్‌ కీ బాత్ రేడియా  కార్యక్రమంలో మాట్లాడుతారు. మొత్తంగా ఇది 96వ ఎపిసోడ్ కాగా.. ఈ ఏడాది చివరిది.
చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం..

మరిన్ని వార్తలు