యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌కు ప్రధాని మోదీ నివాళి

22 Aug, 2021 11:46 IST|Sakshi

లక్నో: యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేం‍ద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. కల్యాణ్‌ సింగ్‌ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు లక్నో చేరుకున్న ప్రధానికి మోదీకి.. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తొలితరం నాయకుడైన కల్యాణ్‌ సింగ్‌ శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.

89 ఏళ్ల కల్యాణ్‌ సింగ్‌ జూలై 4 నుంచి సంజయ్‌గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌జీపీజీఐ)లో చికిత్స పొందుతున్నారు. చేరినప్పటినుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ పలు అవయవాలు పనిచేయకుండా పోవడం, సెప్సిస్‌ (రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపై దాడి చేయడం)తో ఆయన మరణించారని ఎస్‌జీపీజీఐ తెలిపింది.

మరిన్ని వార్తలు