మన సైనికుల పరాక్రమం గర్వకారణం

17 Dec, 2020 06:26 IST|Sakshi

విజయ్‌ దివస్‌ సందర్భంగా మోదీ

న్యూఢిల్లీ:  1971లో దాయాది దేశం పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు సర్వదా శ్లాఘనీయం, గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన సైనిక దళాల పరాక్రమంతో భారత్‌కు నిర్ణయాత్మక విజయం దక్కిందని గుర్తుచేశారు. విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆయన బుధవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్‌ జ్యోతిని వెలిగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ వెల్లడించారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్‌ విజయానికి 49 ఏళ్లు నిండాయి. ఏడాది పాటు జరగనున్న 50వ వార్షికోత్సవాలను మోదీ ప్రారంభించారు.

ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్‌ జ్యోతిని స్వయంగా వెలిగించి, వేడుకలకు శ్రీకారం చుట్టారు. 4 విజయ జ్యోతులను(కాగడాలు) దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు రక్షణ శాఖ తెలియజేసింది. 1971 యుద్ధంలో పరమ వీరచక్ర, మహా వీరచక్ర పురస్కారాలు పొందిన విజేతల సొంత గ్రామాలకు ఈ జ్యోతులు వెళ్తాయని తెలిపింది. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్తాన్‌లో భారత్‌ విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్‌ 16న విజయ్‌ దివస్‌ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విజయానికి 49 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈసారి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు స్వర్ణ విజయోత్సవాలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు