అగ్నిప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

9 Aug, 2020 10:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఒక ప్రైవేటు హాస్పిటల్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, అందులో తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.  (మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా)

అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలను చేపట్టడంతో.. భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు. దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని మోదీకి జగన్‌ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధానమంత్రికి సీఎం తెలిపారు. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం)

విజయవాడలో అగ్ని ప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు