జి–20 సదస్సుకు ప్రధాని మోదీ

25 Oct, 2021 06:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటలీలోని రోమ్‌లో ఈ నెల 30న ప్రారంభం కానున్న జి–20 దేశాల అధినేతల 16వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రధాని ఈ నెల 29 నుంచి నవంబర్‌ 2వ తేదీదాకా ఇటలీతోపాటు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో పర్యటిస్తారని తెలియజేసింది. కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌)–26 ప్రపంచ దేశాల అధినేతల సదస్సులోనూ ఆయన పాల్గొంటారని పేర్కొంది.

జి–20 కూటమికి ప్రస్తుతం ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఈ నెల 30, 31న.. రోమ్‌లో రెండో రోజులపాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఆ దేశమే ఆతిథ్యం ఇస్తోంది.  అఫ్గానిస్తాన్‌ పరిణామాలు, వాతావరణ మార్పులు మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా వైరస్‌ వంటి కీలక అంశాలపై జి–20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. 1999 నుంచి జి–20 సదస్సును ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. కాప్‌–26 సదస్సు ఈ నెల 31 నుంచి నవంబర్‌ 12 దాకా యూకేలోని గ్లాస్గోలో జరగనుంది. 

మరిన్ని వార్తలు