ఇంట్లోకి వచ్చిందని పామును కొట్టి చంపాడు.. పోలీసులు కేసు పెట్టారు

10 Jan, 2023 13:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లఖ్‌నవూ: పాము, తేలు వంటి విషపురుగులు కనిపిస్తే ఎవరైనా భయంతో పరుగులు పెడతారు. చాలా వరకు గ్రామాల్లో పాములు, తేళ్లు కనిపిస్తే చంపేస్తారు. అవి కాటు వేస్తే ప్రమాదం కనుక చంపటం తప్పేమి కాదని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా అనుకుంటే పొరపాటే. అలాగే ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిందని పామును చంపేశాడు. పోలీసులు కేసు పెట్టడంతో అవాక్కయ్యాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌ జిల్లాలో జరిగింది. 

ఛప్రౌలి ప్రాంతంలోని షాబ్గా గ్రామంలో ఆదివారం రాత్రి రామ్‌ చరణ్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ పాము ప్రవేశించింది. దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు గుమిగూడారు. స్వలీన్‌ అనే వ్యక్తి అక్కడికి వచ్చి పామును చంపేశాడు. ఈ విషయంపై సోమవారం ఉదయం అటవీ శాఖకు సమాచారం అందింది. ఫారెస్ట్‌ గార్డ్‌ సంజయ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వలీన్‌పై అటవీ జంతువుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. 

పెద్ద వస్తువుతో పామును నుజ్జు నుజ్జు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, పాము మృతికి గల అసలు కారణాలు తెలుసుకునేందుకు పోస్ట్‌ మార్టం నిర్వహించేందుకు తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?!

మరిన్ని వార్తలు