గుడిలో నా పెళ్లి సర్‌.. మమ్మల్ని వదిలేయండి!

26 Apr, 2021 13:50 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నిమిషాల్లో విహహం చేసుకోబోయే ఓ వరుడు విచిత్రమైన సంఘటన ఎదుర్కొన్నాడు. మాగడి రోడ్డులో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కల్యాణ మండపానికి తన స్నేహితుడి బైక్‌పై బయలుదేరాడు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారాంతపు కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలియదా అంటూ వారిని ప్రశ్నించారు.

బైక్‌ వెనక కూర్చున్న వరుడు స్పందిస్తూ.. నేను పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నాను సర్‌. సమయానికి ఏ వాహనం లేకపోవడంతో నా స్నేహితుడితో బైక్‌పై కల్యాణ మండపానికి వెళ్లుతున్నట్లు తెలిపాడు. తప్పించుకోవడానికి ఏ వంకా దొరకలేదా బాబు! పెళ్లంటూ ఎందుకు అబద్దం చెబుతున్నావని పోలీసులు గట్టిగా నిలదీశారు. దీంతో పెళ్లి కొడుకు తన జేబులో ఉన్న శుభలేఖను తీసి చూపించాడు. అప్పటికీ పోలీసులకు నమ్మకం కలగలేదు.

కల్యాణ మండపంలో పెళ్లి చేసుకుందామని భావించగా అక్కడ అనుమతి దొరకలేదని దీం‍తో స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకుంటున్నానని ఆ యువకుడు పోలీసులకు వివరించాడు. ఇప్పటికే వధువు, ఆమె కుటుంబ సభ్యులు, తమ తల్లిదండ్రులు, బంధువులు గుడికి చేరుకున్నారని తెలిపాడు. ముహూర్తానికి సమయం మించిపోతోందని తనను విడిచిపెట్టాలని పోలీసులకు కోరుకున్నాడు. ఆ యువకుడు చెప్పింది నిజమని పోలీసులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వివాహానికి పది నిమిషాల టైం పెట్టుకుని ఇప్పుడా వెళ్లేది అంటూ  ఆ యువకుడి పెళ్లికి ముందస్తు శుభాకాంక్షలు చెప్పి వారిని వదిలిపెట్టారు.

చదవండి: ఆ ట్యాంకర్ రాకుంటే...వందకు పైగా ప్రాణాలు గాల్లో కలిసేవి

మరిన్ని వార్తలు