Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్‌ కిషోర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే?

13 Nov, 2022 20:13 IST|Sakshi

పట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) ‍ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెటుతున్నట్లు కొద్ది నెలల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఓ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు ఇన్నాళ్లు మౌనం పాటించిన ఆయన సస్పెన్స్‌ను బ్రేక్‌ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. బిహార్‌ వ్యాప్తంగా ప్రజలను కలిసేందుకంటూ ‘జన్‌ సూరాజ్‌ అభియాన్‌’ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. 

ఓ ఇంటర్వ్యూలో మీరు ఎన్నికల బరిలో నిలుస్తున్నారా? అని అడిగి ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? నాకు అలాంటి ఆకాంక్షలు లేవు’ అని తేల్చేశారు ప్రశాంత్‌ కిషోర్‌. ఈ సందర్భంగా జేడీయూ, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తాను స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకున్న తర్వాత జేడీయు నేతలు తనను తిట్టేందుకు ఇష్టపడుతున్నారని ఆరోపించారు. తనకు రాజకీయ అవగాహన లేకపోతే నితీశ్‌ కుమార్‌ వెంట రెండేళ్లు ఏం పని చేశానో ఆయననే ప్రశ్నించాలని సూచించారు. 

జేడీయూ-ఆర్‌జేడీ కూటమి ప్రభుత్వం ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తోసిపుచ్చారు ప్రశాంత్‌ కిషోర్‌. వారు ఇచ్చిన హామీని నెరవేరుస్తే తన పాదయాత్రను ఆపేస్తానని సవాల్‌ చేశారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు కిషోర్‌. ఈ సందర్భంగా జన్‌ సూరాజ్‌ కార్యక్రమం పార్టీగా మారనుందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే..

మరిన్ని వార్తలు