పూజా చవాన్‌ ఆత్మహత్య.. మంత్రి రాజీనామా

1 Mar, 2021 04:34 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర అటవీ  మంత్రి సంజయ్‌ రాథోడ్‌ ఆదివారం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు అందజేశారు. రాష్ట్రంలో ఓ మహిళ మరణానికి సంజయ్‌ రాథోడ్‌ కారణమని ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మహిళ మరణంపై నీచ రాజకీయాలు చేస్తున్నారని సంజయ్‌ రాథోడ్‌ మండిపడ్డారు. సత్యం నిగ్గుతేలాలన్న ఉద్దేశంతోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన పూజా చవాన్‌ (23) ఫిబ్రవరి 8న పుణేలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంజయ్‌ వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బాధిత మహిళతో మంత్రి ఉన్నట్లు, మాట్లాడినట్లుగా చెబుతున్న ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన తొలిమంత్రి సంజయ్‌ రాథోడ్‌. 

మరిన్ని వార్తలు