కార్డినల్‌గా పూల ఆంథోనీ

30 May, 2022 05:21 IST|Sakshi

ప్రకటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి

గోవా ఆర్చి బిషప్‌కూ కార్డినల్‌ హోదా

హైదరాబాద్‌: ఆర్చిబిషప్‌ పూల ఆంథోనీ(60) భారత్‌లో కార్డినల్‌గా నియమితులయ్యారు. కేథలిక్కుల మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ వాటికన్‌ సిటీలో ఆదివారం 21 మందిని కొత్త కార్డినల్స్‌గా ప్రకటించారు. వీరిలో భారత్‌ నుంచి ఆంథోనీతోపాటు గోవా, డామన్‌ ఆర్చి బిషప్‌ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో ఉన్నారు. కేథలిక్‌ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్‌ హోదాలో పోప్‌ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఈయనకు ఉంటుంది.

ఆగస్ట్‌ 27వ తేదీన జరిగే సమావేశం నాటికి కార్డినల్స్‌ సంఖ్య 229కు పెరగనుంది. అందులో 131 మందికి పోప్‌ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ 1992లో మొదటిసారిగా మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్‌ ఆర్చిబిషప్‌ అయ్యారు. ఆగస్ట్‌ 27న వాటికన్‌లో కొత్త కార్డినల్స్‌ పరిషత్‌ సమావేశానికి పూల ఆంథోనీ హాజరుకానున్నారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్‌ ఆర్చిబిషప్‌ హోదాలోనూ కొనసాగనున్నారు.

మరిన్ని వార్తలు