రూ.12 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పొందండి

4 May, 2021 17:51 IST|Sakshi

ప్రస్తుతం కరోనా లాంటి విపత్కర పరిస్థితులు చూశాక? ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని భవిష్యత్ సమస్యల నుంచి సురక్షితంగా ఉంచడానికి బీమా పొందడం చాలా ముఖ్యం. అయితే, భీమా ప్రీమియం చెల్లించడం అనేది అంత తేలికైన విషయం కాదు. మరి దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈ ప్రీమియాన్ని భరించలేక బీమా తీసుకోవడం మానేస్తారు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి కేంద్రం ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనను 2015లో తీసుకొచ్చింది. 

ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనలో చేరడానికి సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా 2 లక్షల వరకు భీమా పొందవచ్చు. ఇతర భీమా పాలసీలతో పోలిస్తే ఈ ప్రమాద బీమా పథకం చాలా చౌకగా ఉంటుంది. బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తును భద్రతతో పాటు కుటుంబ సభ్యులు ఆర్ధికంగా సురక్షితంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. దీని కింద చేరిన వారికి ఏదైనా ప్రమాదవశాత్తు మరణం, పూర్తి వైకల్యానికి గురైతే రూ.2లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష రూపాయలు అందుతాయి. ప్రీమియం కింద ఏడాదికి రూ.12 మొత్తాన్ని ఖాతాదారుడి బ్యాంక్ ఖాతా నుంచి (ఆటో-డెబిట్' సౌకర్యం ఉంది) కట్ చేస్తారు. 

అర్హత:
18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వార్షిక పునరుద్ధరణ ప్రాతిపదికన జూన్ 1 నుండి మే 31 కాలానికి భీమా కవరేజ్ అందుతుంది. బ్యాంక్ ఖాతాకు ఆధార్ తప్పని సరిగా లింకు అయ్యి ఉండాలి.

కావాల్సిన పత్రాలు:

  • అప్లికెంట్ ఆధార్ కార్డు
  • గుర్తింపు కార్డు
  • బ్యాంక్ ఖాతా పాస్ బుక్
  • వయస్సు ధృవీకరణ పత్రం
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • మొబైల్ నెంబర్
  • పాస్ పోర్ట్ ఫోటో

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనకు ధరఖాస్తు చేసుకోవడానికి మీ బ్యాంక్ హోమ్ సంప్రదించవచ్చు లేదా వివరణాత్మక సమాచారం కోసం మీరు PM Surkasha Bima Yojana వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

చదవండి:

కరోనా సంక్షోభంపై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు