మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

31 Aug, 2020 17:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ప్రణబ్‌ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు.

ప్రణబ్ జీవిత చరిత్ర
ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు.

రాజకీయ జీవితం

  • 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక
  • 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక
  • 1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత
  • 1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా
  • 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా...
  • 1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా..
  • 1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా..
  • 1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా..
  • 1982-84లో ఆర్థికమంత్రిగా..
  • 1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా..
  • 1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా..
  • 1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు
  • జంగీపూర్ నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నిక
  • 2004-06లో రక్షణశాఖ మంత్రిగా..
  • 2006-09లో విదేశాంగమంత్రిగా..
  • 2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు
  • 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
మరిన్ని వార్తలు