తమిళనాడులో దారుణం.. కడుపులో ఉన్నది తన బిడ్డ కాదన్న రెండో భర్త.. కాలితో తన్నడంతో

31 Dec, 2022 11:07 IST|Sakshi

సాక్షి, చెన్నై: కండాచ్చిపురంలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతి అని కూడా చూడకుండా కాలితో తన్నడంతో గర్భస్రావంతో భార్య మృతిచెందింది. వివరాలు.. తిరుకోవిలూరు కండాచ్చిపురం సమీపంలోని వీరంగిపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ కుమార్తె భారతి (23) చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు సూరకోటకు చెందిన ఈశ్వరన్‌తో పరిచయం ఏర్పడి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం ఇద్దరూ విడిపోయారు.

భారతి తన కుమారుడితో కలిసి వీరంగిపురం కులత్తుమెట్టు వీధిలోని అత్త లక్ష్మి ఇంట్లో ఉంటోంది. మలవతంగాల్‌ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ సెల్వపాండియన్‌ (30)తో పరిచయం ఏర్పడి రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం 4 నెలల గర్భవతి. ఈ క్రమంలో కడుపులో ఉన్నది తన బిడ్డకాదని, ఆబార్షన్‌ చేసుకోవాలని సెల్వపాండియన్‌ భార్యను కోరడంతో ఆమె నిరాకరించింది.

ఆవేశానికి గురైన సెల్వపాండియన్‌ భారతిని కిందకు తోసి ఆమె కడుపుపై తన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో గురువారం మృతి చెందింది. భారతి తండ్రి చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు కండాచ్చిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్వపాండియన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.   

మరిన్ని వార్తలు