అధికారికం: సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌.. రెండు నెలలు మాత్రమే!

10 Aug, 2022 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్‌ యూయూ లలిత్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. 

భారత దేశ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ యూయూ లలిత్‌.. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్‌ యూయూ లలిత్‌ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. అయితే.. జస్టిస్‌ యూయూ లలిత్‌ కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎందుకంటే.. ఆయన నవంబర్‌ 8న పదవీ విరమణ చేయనున్నారు. 

జస్టిస్‌ యూయూ లలిత్‌ 1957, నవబర్‌ 9న జన్మించారు. 1983లో లీగల్‌ కెరీర్‌ను ప్రారంభించారు. 1985 డిసెంబర్‌ వరకు ముంబై హైకోర్టులో పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2004, ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు జడ్జీగా నియమితులయ్యే వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక న్యాయవాదిగా పని చేశారు. 2014, ఆగస్టు 13న సుప్రీ కోర్టు జడ్జీగా నియమితులయ్యారు.

ఇదీ చదవండి: పిల్లలు 7 గంటలకే స్కూల్‌కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా?

మరిన్ని వార్తలు