రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌: రూం నెం.63లోనే ‘మిస్టర్‌ బాలెట్‌ బాక్స్‌’ ఎందుకంటే..

21 Jul, 2022 10:27 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశమంతా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రౌపది ముర్ము, యశ్వంత్‌ సిన్హాలలో ఎవరు నెగ్గుతారనేదానిపై జోరుగా చర్చ నడుస్తోంది.  ఈ క్రమంలో.. పార్లమెంట్‌ రూం నెంబర్‌ 63 వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. 


పార్లమెంట్‌ హౌజ్‌తో సహా దేశంలోని మొత్తం 31 ఓటింగ్‌ కేంద్రాల నుంచి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు మంగళవారం సాయంత్రం కల్లా పార్లమెంట్‌కు చేరుకున్నాయి. 

► ఈ బ్యాలెట్‌ బాక్సులను ‘మిస్టర్‌ బాలెట్‌ బాక్స్‌’గా పిలుస్తుంటారు.  

► రూమ్‌ నెంబర్‌ 63 పార్లమెంట్‌ స్ట్రాంగ్‌ రూమ్‌. అందుకే ఈ గదిలోనే మిస్టర్‌ బాలెట్‌ బాక్స్‌ను ఉంచారు. ఇక్కడే ఉదయం 11 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి, ఆ రూమ్‌ను, చుట్టుపక్కల ప్రాంతాన్ని సైలెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

► రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ పీసీ మోదీ.. రాష్ట్రపతి ఎన్నికలకు చీఫ్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. కాబట్టి, ఆయన ఆధ్వర్యంలోనే కౌంటింగ్‌ మొదలవుతుంది. 

► ముందుగా ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆపై రాజ్యసభ సెక్రెటరీ దగ్గరుండి ట్రెండ్‌ను ప్రకటిస్తారు.  ఆ తర్వాతే ఆల్ఫాబెట్‌ క్రమంలో రాష్ట్రాల ఓట్లను లెక్కిస్తారు. మళ్లీ ఒకసారి ట్రెండ్‌ మధ్యలో చెప్తారు. చివరాఖరికి రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను.. విజేతను ప్రకటిస్తారు. 

► ప్రతీ బ్యాలెట్‌ బాక్స్‌కు ‘మిస్టర్‌ బాలెట్‌ బాక్స్‌’ కింద ఈ-టికెట్‌ జారీ చేస్తుంది ఎన్నికల సంఘం. 

► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేది ఎంపీలు, ఎమ్మెల్యేలు. కానీ, వాళ్లంతా ప్రజాప్రతినిధులై ఉండాలి. అంటే.. నామినేటెడ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదన్నమాట.

► ఈసారి ఎన్నికల్లో దాదాపు 99 శాతం మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ వెల్లడించింది. 

► మొత్తం 4,809 ఎలక్టోర్స్‌.. 778 ఎంపీలు, ,4,033 ఎమ్మెల్యేలు ఓటేశారు. అనారోగ్యంతో కొందరు ఓటేయలేదు. 

► గత రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10,69,358 ఓట్లకుగానూ రామ్‌నాథ్‌ కోవింద్‌కు 7,02,044 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి మీరా కుమార్‌కు 3,67,314 ఓట్లు వచ్చాయి. 

మరిన్ని వార్తలు