పానీపూరీలు అమ్ముకుంటున్న వైద్యురాలు.. ఎందుకంటే..

27 Mar, 2023 09:04 IST|Sakshi

ఓ లేడీ డాక్టర్‌ రోడ్డుపై పానీపూరి బండి పెట్టుకుని పానీపూరీలు అమ్ముకుంటోంది. ఆ బండి పైనే బోర్డుపై ప్రైవేటు డాక్టర్‌ అని కూడా రాసి ఉంది. ఆమె తోపాటు పనిచేసిన సిబ్బంది పక్కనే టీ అమ్ముకుంటూ కనిపించారు. అక్కడ ఉన్న వేలాది మంది వైద్యులు రోడ్డుపై ఇలా వివిధ వ్యాపారాలు చేసుకుంటూ కనిపించారు. అక్కడ ఆ వైద్యులు ఇలా చేయడానికి పెద్ద కారణమే ఉంది. 

వివరాల్లోకెళ్తే.. రాజస్తాన్‌లోని ప్రైవేటు ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికార్‌ జిల్లాకు చెందిన ఓ లేడీ డాక్టర్‌ ఆస్పత్రికి తాళం వేసి మరీ ఇలా పానీపూరీలు అమ్ముకుంటోంది. అక్కడ ఉన్న మిగతా ప్రైవేటు వైద్యులంతా ఆస్పత్రులకు తాళం వేసి ఇలానే టీ, పానీపూరీలు, కోడుగుడ్లు స్టాల్స్‌ పెట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఆ స్టాల్స్‌పై ఏర్పాటు చేసిన బోర్డుపై ప్రైవేటు డాక్టర్లమని రాసి ఉంటుంది. ఆస్పత్రి యాజమాన్యం సైతం ఇలానే చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. వాస్తవానికి అక్కడ రాజస్తాన్‌ ప్రభుత్వం రైట్‌ టు హెల్త్‌ అనే బిల్లు తీసుకువచ్చింది.

ఈ బిల్లు ప్రకారం ప్రతి పౌరుడు ఎలాంటి చార్జీలు లేకుండా ఎక్కడైనా అత్యవసర వైద్యం పొందొచ్చు. దీన్ని రాజస్తాన్‌లోని ప్రైవేటు ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు వైద్యుల బృందం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని డిమాండ్‌ చేస్తూ..ఇలా విభిన్నంగా ర్యాలీలు చేపట్టారు. ఈ చట్టం పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు రాజస్తాన్‌ ప్రభుత్వం యత్నిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ వైద్యుల డిమాండ్‌ చేస్తున్నారు.

అంతేగాదు సోమవారం రాజస్తాన్‌లోని మొత్తం వైద్య సదుపాయాలను మూసి వేసి..ఇలాంటి నిరసనలే పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. పైగా ఈ నెల 29న దేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి వైద్యుల బృందాలు ఈ నిరసన కోసం రాజస్తాన్‌కు వస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనిపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రే తనను కలవాలని వైద్యులకు చెప్పినా.. వాని నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే ఆదివారం మీడియా ద్వారా ప్రభుత్వం వైద్యులందరిని విధుల్లోకి రావాల్సిందిగి విజ్ఞప్తి చేసినా..అందుకు కూడా వైద్యులు ప్రతిస్పందించ లేదు. దీంతో ప్రభుతం ఈ నిరసనలను అణిచివేసేందుకు సన్నహాలు ప్రారంభించినట్లు అధికారిక వర్గాల సమాచారం.   

(చదవండి: జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విధించండి)

మరిన్ని వార్తలు