మహిళల భద్రత మీ బాధ్యతే: ప్రియాంక గాంధీ

29 Sep, 2020 14:35 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఇప్పటికే తరచు మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడంలేదంటూ ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా హత్రాస్ సామూహిక అత్యాచార సంఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. 

సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.  ఆ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించింది. ఈ విషయంపై ట్విట్టర్‌ వేదిక ప్రియాంక స్పందించారు. "హత్రాస్‌లోకొందరు మృగాలకు బలై ఒక దళిత  మహిళ ఈ రోజు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో కన్నుమూసింది. రెండు వారాలుగా ఆమె జీవర్మరణ సమస్యతో పోరాడింది’ అని ప్రియాంక గాంధీ వాద్రా హిందీలో ట్వీట్‌ చేశారు. 

హత్రాస్, షాజహన్‌పూర్, గోరఖ్‌పూర్‌లలో ఒకదాని తరువాత ఒకటిగా జరుగుతున్న హత్యాచార ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయని ప్రియాంక అన్నారు. యూపీలో శాంతిభద్రతలు చాలా వరకు క్షీణించాయి. మహిళలకు రాష్ట్రంలో ఏవిధమైన భద్రత లేకుండా పోయింది.   నేరస్థులు బహిరంగంగా నేరాలకు పాల్పడుతున్నారు’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. దళిత మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.  "యూపీలో మహిళల భద్రతకు మీరు జవాబుదారీగా ఉన్నారు" అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక ట్వీట్‌ చేశారు. 

హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులు ఆమె గొంతుకోశారు. దీంతో ఆమెను మొదట స్థానిక ఆసుపత్రిలో  చేర్పించారు. అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడతో ఆమెను ఢిల్లీలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఆ మహిళ మంగళవారం ఉదయం కన్నుమూసింది.  

చదవండి: మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లారు..

మరిన్ని వార్తలు