పరారీలో అమృత్‌పాల్‌

20 Mar, 2023 05:27 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లో వివాదాస్పద ఖలిస్తానీ నేత,, ‘వారిస్‌ దే పంజాబ్‌’ సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌సింగ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం నుంచి మొదలైన గాలింపులో అతడి 78 మంది అనుచరులను అరెస్ట్‌ చేశామన్నారు. ఆదివారం అదుపులోకి తీసుకున్న నలుగురు అమృత్‌పాల్‌ సన్నిహితులను అస్సాంలోని డిబ్రూగఢ్‌ సెంట్రల్‌ జైలుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో తరలించామన్నారు.

అమృత్‌పాల్‌ జాడ కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. రాష్ట్రంలో మొబైల్‌ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ సేవల నిలిపివేతను సోమవారం దాకా పొడిగించారు. శనివారం ఛేజింగ్‌ సమయంలో తన కాన్వాయ్‌ ముందు వాహనంలో ఉన్న అమృత్‌పాల్‌ సింగ్, ఇరుకు సందుల్లో వెళుతూ అదను చూసి తప్పించుకున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. కానీ అమృత్‌పాల్‌ పోలీసుల అదుపులోనే ఉన్నాడని అతడి తండ్రి తర్సెమ్‌ సింగ్‌ అంటున్నారు.

మరిన్ని వార్తలు