తదుపరి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ షురూ

13 Sep, 2020 06:09 IST|Sakshi
రణ్‌దీప్‌ సూర్జేవాలా

వెల్లడించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) అప్పగించిన అధికారం మేరకే అధినేత్రి సోనియాగాంధీ సంస్థాగత మార్పులను చేపట్టారని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించేందుకే ఆమె ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారని వివరించింది. తాజా మార్పులపై కొందరు నేతల ప్రకటనలపై కాంగ్రెస్‌ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు.

ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతలెవరూ ఎటువంటి ప్రకటనా చేయలేదని, వ్యాఖ్యానించలేదని అన్నారు. సోనియా చేపట్టిన సంస్థాగత మార్పులపై రాహుల్‌ గాంధీ ముద్ర ఉందా అని అడగ్గా..రాహుల్‌ గాంధీని ఏఐసీసీ ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నుకుందనీ, 2019 ఎన్నికల ఫలితాలకు బాధ్యతవహిస్తూ ఆయన వైదొలిగారని గుర్తు చేశారు. కోట్లాదిమంది కాంగ్రెస్‌ కార్యకర్తలతోపాటు సీడబ్ల్యూసీ కూడా సోనియా, రాహుల్‌ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించాయన్నారు. మరోవైపు, క్రమం తప్పకుండా జరిగే మెడికల్‌ చెకప్‌ కోసం శనివారం ఉదయం కొడుకు రాహుల్‌ గాంధీతో కలిసి సోనియాగాంధీ అమెరికా వెళ్లినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు