తండ్రి హత్యపై రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

17 Feb, 2021 20:38 IST|Sakshi

హంతకులపై ఎలాంటి కోపం లేదు

పుదుచ్చేరి ప్రచారంలో రాహుల్‌ గాంధీ

పుదుచ్చేరి: అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో ప్రమాదంలో పడిన ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కొందరు రాజీవ్‌గాంధీ హత్య, హంతకులపై మీ అభిప్రాయం చెప్పండి అని రాహుల్‌ను అడిగారు. దీంతో రాహుల్‌ గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. మా నాన్న హత్య చేసిన వారిని క్షమిస్తున్నా అని ప్రకటించారు. వారిపై (హంతకులు) తనకేం కోపం లేదని స్పష్టం చేశారు. ‘నా తండ్రిని కోల్పోయాను. అది అత్యంత కఠిన కాలం. కాకపోతే నాకు ఎవరిపై కోపం లేదు. మీకు ఎవరైనా గుండెకోత కలిగిస్తారో.. నాకు అంతకంటే ఎక్కువగా బాధ ఉంది. అయినా కూడా నాకు ఎవరిపై కోపం లేదు. వారిని క్షమిస్తున్నా. నా తండ్రి నాలో ఉన్నాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పాల్గొన్నారు. అనంతరం పుదుచ్చేరిలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, అకస్మాత్తుగా రాత్రికి రాత్రి గవర్నర్‌ మార్పు అంశాలపై స్పందించారు. అనంతరం తమిళనాడులో కూడా రాహుల్‌ పర్యటించారు. తమిళ రాజకీయాలపై స్పందించారు.

మరిన్ని వార్తలు