పంజాబ్‌లో కీలక పరిణామం.. మంత్రి పదవికి ఆప్‌ నేత ఫౌజా సింగ్‌ రాజీనామా

7 Jan, 2023 13:50 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఆహారశుద్ధి, ఉద్యానవన శాఖ మంత్రి ఫౌజా సింగ్‌ సరారీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలుపుతూ తన రాజీనామా లేఖను సమర్పించారు సరారీ. తాను పార్టీకి నమ్మకమైన సైనికుడినని, పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే, తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల్లోనే రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంత్రి ఫౌజా సింగ్‌ సరారీపై నాలుగు నెలల క్రితం అవినితీ ఆరోపణలు వచ్చాయి. ఆయన ఓఎస్‌డీ తర్సెమ్‌ లాల్‌ కపూర్‌తో మాట్లాడిన ఓ ఆడియో వెలుగులోకి రావటం మంత్రిని ఇరుకునపెట్టింది. ఆహారధాన్యాల కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే విషయంపై ఇరువురు మాట్లాడుకున్నట్లు ఆ ఆడియోలో బయటపడింది. దీంతో మంత్రితో పాటు ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఫౌజాను మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. అయితే ఆ ఆరోపణలను ఖండించారు ఫౌజా. 

మంత్రి రాజీనామా చేసిన క్రమంలో శనివారం సాయంత్రం పంజాబ్‌ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ జరగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. సరారీ స్థానంలో పాటియాలా రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ లేదా జాగ్రాన్‌ ఎమ్మెల్యే సరవ్‌జిత్‌ కౌర్‌ మనుకే మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: అథ్లెట్‌ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా!

మరిన్ని వార్తలు