అదృష్టమంటే ఇదే: వంద పెట్టింది.. కోటి గెలిచింది

25 Feb, 2021 22:32 IST|Sakshi

అమృత్‌సర్‌‌: అదృష్టమంటే ఆమెదే. రూ.వంద ఖర్చు చేసింది.. ఏకంగా కోటి రూపాయలు సొంతం చేసుకుంది. వస్త్ర వ్యాపారం చేసుకునే ఆమె ఒక్కసారిగా కోటీశ్వరాలుగా మారింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో ఆ అదృష్టం వరించింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అమృత్‌సర్‌కు చెందిన రేణు చౌహాన్‌ గర్భిణి. భార్యాభర్తలు ఇద్దరూ వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

రేణు ఇటీవల రూ.100 పెట్టి లాటరీలో డీ-12228 టికెట్‌ కొనింది. ఈ లాటరీకి సంబంధించిన డ్రా ఫిబ్రవరి 11వ తేదీన తీశారు. ఆ డ్రాలో రేణు కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ తగిలింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు ఆమెకు సమాచారం అందించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అవసరమైన పత్రాలు సమర్పించాలని లాటరీస్‌ శాఖ అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆమె గురువారం కార్యాలయానికి చేరుకుని అవసరమైన పత్రాలు అందించింది. త్వరలోనే ఆమె బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నగదుతో తమ కష్టాలు తీరుతాయని రేణు చౌహాన్‌ తెలిపింది. లాటరీ నగదుతో తాము హాయిగా జీవిస్తామని హర్షం వ్యక్తం చేస్తూ రేణు చెప్పింది.

మరిన్ని వార్తలు