‘పుతిన్‌’ను వ్యతిరేకిస్తే అంతేనా? ఒడిశాలో మరో రష్యన్‌ మిస్సింగ్‌!

31 Dec, 2022 15:34 IST|Sakshi

భువనేశ్వర్‌: పది నెలలుగా ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశ పౌరులు ఇటీవల ఒడిశాలోని రాయగడ హోటల్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పావెల్‌ అంటోవ్‌(65) అనే ఎంపీ, ఆయన స్నేహితుడు ఇరువురు రెండ్రోజుల వ్యవధిలో హోటల్‌లో రక్తపు మడుగులో పడి కనిపించటం కలకలం రేపింది. ప్రస్తుతం పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన మరో రష్యా పౌరుడు కనిపించకుండా పోయాడనే వార్త కలకలం సృష్టిస్తోంది. ఒడిశాలో ఏం జరుగుతోంది? అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు. 

ఇదీ జరిగింది..
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం.. రష్యాకు చెందిన ఓ 60ఏళ్ల వ్యక్తి ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. తాను రష్య వసలదారుడినని, తాను యుద్ధానికి, పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను నిరాశ్రయుడిగా మారానని, తనకు సాయం చేయాలని కోరాడు. మరోవైపు.. రైల్వే స్టేషన్‌లో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి ఆచూకీ గల్లంతైనట్లు వార్తలు చక్కర్లు కొంటాయి. ఆయనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాయి. ఒడిశా రాయగడలోని హోటల్‌లో ఇద్దరు రష్యన్‌ వ్యక్తులు మరణించిన క్రమంలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆ వార్తలను కొట్టిపారేశారు ఒడిశా పోలీసులు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. 

ఇప్పటి వరకు ఎలాంటి అదృశ్యం కేసు నమోదు కాలేదని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘నవంబర్‌లోనూ ఆ వ్యక్తి ప్లకార్డు పట్టుకుని రైల్వే స్టేషన్‌లో కనిపించాడు. ఆయన పాస్‌పోర్టును తనిఖీ చేశాం. ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కుంటున్నాడు. అతడి వివరాలు తనిఖీ చేసి పూరీకి పంపించాం. అప్పటి నుంచి తనవారితో అక్కడే ఉంటున్నాడు. రాయగడ హోటల్‌ ఘటనలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు’అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో..

మరిన్ని వార్తలు