కాంట్రాక్టులన్నీ అదానీకే ఎందుకు: రాహుల్‌

21 Feb, 2023 05:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని ఆరు ఎయిర్‌పోర్టుల కాంట్రాక్టులను అదానీ గ్రూప్‌కే కట్టబెట్టడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మేజిక్‌తో అదానీ లాభపడ్డారని పేర్కొన్నారు. సోమవారం మిత్ర–కాల్‌ పేరుతో రాహుల్‌ గాంధీ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఒక వీడియోను విడుదల చేశారు. ‘మిత్ర–కాల్‌లో కబ్జారాజ్యం నడుస్తోంది. విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, భద్రతాబలగాలు, మీడియా, బొగ్గు, ఇంధనం..ఇలా అన్నిటిపై పెత్తనాన్ని ఒక్కరికే అప్పగించారు.

వీటిపై మీడియా మాట్లాడదు. నా ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పరు’అని రాహుల్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌లో అక్రమాలు, దేశ సంపద లూటీ అవుతున్న తీరుపై పార్లమెంట్‌లో వెల్లడించిన నిజాలను ప్రభుత్వం రికార్డులనుంచి తొలగించిందని అందులో పేర్కొన్నారు. ‘ఫకీర్‌ తన మేజిక్‌తో సంచీలోంచి తీసిన ఎయిర్‌పోర్టును అదానీ చేతుల్లో పెట్టారు’అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తాను తప్ప వ్యాపార సంస్థలను కాదని రాహుల్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు