Rohit Ranjan Arrest: రాహుల్‌ గాంధీ ఫేక్‌ వీడియో కేసులో న్యూస్‌ యాంకర్‌ అరెస్టు!

5 Jul, 2022 12:47 IST|Sakshi

న్యూఢిల్లీ: జీ టీవీ న్యూస్‌ యాంకర్‌ రోహిత్‌ రంజన్‌ని అతని నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఘజియాబాద్‌ పోలీసులు జోక్యం చేసుకుని రంజన్‌ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అయితే యాంకర్‌ రంజన్‌ను అరెస్టు చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతను అరెస్టు కావల్సి వచ్చింది. ప్రస్తుతం అతను యూపీ పోలీసుల అధీనంలో ఉన్నాడు.

అసలేం జరిగిందంటే...రోహిత్‌ జీ టీవీ ఛానెల్‌లో పేరుగాంచిన డీఎన్‌ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్‌ గాంధీకి సంబంధించిన ఒక వీడియో న్యూస్‌ని తప్పుగా అందించారు. ఆ తర్వాత ఛానెల్‌ వెంటనే సరిచేసుకుని క్షమాపణల చెప్పింది. ఐతే ఆ వీడియోలో  రాహుల్‌ గాంధీ ఏం మాట్లాడారంటే.."రాహుల్ గాంధీ తన వయనాడ్ కార్యాలయంపై దాడిని ప్రస్తావిస్తూ...ఇలా చేసిన యువకులు చాలా బాధ్యతారహితం ప్రవర్తించారు. అయినా వారు చిన్న పిల్లలు క్షమించండి. అని అన్నారు." అయితే జీ ఛానెల్‌ ఉదయపూర్‌లో కన్హయ్య లాల్‌ను చంపిన ఘటనతో లింక్‌ చేస్తూ... వారు చిన్నపిల్లలని, వారిని క్షమించాలంటూ చెబుతున్నట్లుగా వక్రీకరించి సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఆ యాంకర్‌పై చత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లలో కేసులు నమోదయ్యాయి.

అంతేకాదు ఆ ఛానల్‌ జర్నలిస్ట్‌ ట్విట్టర్‌​లో..చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా తనని ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసం నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఎలా తీసుకువెళ్లారని రంజన్‌ ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ...సమాచారం ఇవ్వాలనే నియమం లేదు. అయినా ఇప్పడూ మీకు తెలిసింది కాబట్టి తమకు సహకరించాలని రంజన్‌కి చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ..బీజేపీ నాయకుడు అమిత్‌ మాల్వియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల పై దాడులు నిర్వహించేందుకు చత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లను నిర్మోహమాటంగా కాంగ్రెస్‌ వినియోగించేస్తుందంటూ..  విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ నాటి అధికార జ్ఞాపకాల మత్తులో కూరుకుపోయి ఇలాంటి ఘటనలకు పాల్పడతోందని అన్నారు.

(చదవండి: శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు?)

మరిన్ని వార్తలు