కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆ ప్రముఖ రాజకీయవేత్త నుంచి చాలా విషాయాలు నేర్చుకున్నానని చెప్పారు. సీనియర్ రాజకీయవేత్త, లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) నేత 75 ఏళ్ల శరద్ యాదవ్ గురుగ్రామ్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ శరద్ యాదవ్తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించారు. యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా నానమ్మ ఇందిరా గాంధీతో రాజకీయ పోరాటం చేశారని, వీరిద్దరూ గౌరవం, ఆప్యాయతలతో మెలిగేవారిని గుర్తు చేసుకున్నారు.
అంతేగాదు యాదవ్ ఎప్పుడూ ఇతరుల గౌరవాన్ని కోల్పోలేదని, ఇది రాజకీయాలలో అతి గొప్ప విషయమని అన్నారు. శరద్ యాదవ్ సోషలిజం నాయకుడిగా ఉండటమే గాక వినయశీలి. తాను ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని, దేశానికి ఆయన చేసిన కృషి, సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రో ఉన్న రాహుల్ శుక్రవారం యాత్రకు విరామం ఇచ్చి మరీ పంజాబ్ నుంచి ఢిల్లీ చేరుకుని శరద్యాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
(చదవండి: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత)