మాజీ కేంద్ర మంత్రి పాడె మోసిన రాహుల్

19 Feb, 2021 16:52 IST|Sakshi
సతీశ్‌ శర్మ పాడె మోస్తోన్న రాహుల్‌ గాంధీ

రెండు రోజుల క్రితం మాజీ కేంద్ర మంత్రి సతీష్‌ శర్మ మృతి

పాడె మోసిన రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ కేం‍ద్ర మంత్రి కెప్టెన్‌ సతీష్‌ శర్మ రెండు రోజుల క్రితం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఆయన మృతికి సంతాపం తెలిపింది. సతీష్‌ శర్మ అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సతీష్‌ శర్మ పాడె మోశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలని కాంగ్రెస్‌ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. 

ఈ మేరకు ‘‘మరణించిన కెప్టెన్‌ సతీష్‌ శర్మకు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ వినయపూర్వకమైన నివాళులు అర్పించింది. కెప్టెన్‌ దేశ ప్రజలకు చేసిన సేవలను ఎన్నటికి మరువం.’’ అంటూ రాహుల్‌ గాంధీ కెప్టెన్‌ సతీష్‌ శర్మ పాడె మోస్తున్న ఫోటోలను ట్వీట్‌ చేసింది. సతీష్‌ శర్మ మృతి గురించి తెలిసిన వెంటనే రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేం అన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన సతీష్‌ శర్మ గత కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గోవాలోని తన నివాసంలో మృతి చెందారు. గాంధీ కుటుంబానికి ఆయన చాలా నమ్మకస్తుడిగా ఉండేవారు. రాహుల్‌ గాంధీ రాజకీయాల్లో ప్రవేశించిన తొలి నాళ్లలో ఆయనకు మెంటార్‌గా వ్యవహరించారు. పీవీ ప్రభుత్వంలో సతీష్‌ శర్మ 1993 నుంచి 1996 వరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు రాయ్‌ బరేలి, అమేథీ నుంచి లోక్‌సభకు ఎన్నికవ్వగా.. మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతేకాక ఆయన ప్రొఫేషనల్‌ కమర్షియల్‌ పైలెట్‌.

చదవండి: రాహుల్‌ గాంధీ షాకింగ్‌ ట్వీట్‌: ట్విటర్‌ దుమారం

మరిన్ని వార్తలు