ఢిల్లీలో టెన్షన్‌.. టెన్షన్‌.. కాంగ్రెస్‌ కార్యాల‌యం వ‌ద్ద 144 సెక్ష‌న్‌ విధింపు

13 Jun, 2022 14:47 IST|Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నేడు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కార్యాలయానికి హజరుకానున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

కాగా, నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజ‌రవుతున్న సందర్బంగా కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద భారీ భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. వందల సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు.. 'నేను సావర్కర్‌ని కాదు, రాహుల్‌ గాంధీని' అంటూ నినాదాలు చేశారు. కాగా, రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి దర్యాప్తు సంస్థ కార్యాలయం వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. దీంతో, ఢిల్లీ పోలీసులు అక్బ‌ర్ రోడ్‌లోని కాంగ్రెస్ కార్యాల‌యం వ‌ద్ద 144 సెక్ష‌న్‌ను విధించారు. అయితే రాజధానిలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. దీంతో నిరసరకారులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యాల‌యానికి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌ను, బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. బుల్డోజ‌ర్లు ఒక్క‌టే మిస్ అయ్యాయ‌ని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. మైనారిటీ మ‌తాన్ని ఆచ‌రించే వ్య‌క్తుల‌ను, ఇండ్ల‌ను ధ్వంసం చేసే ప‌నిలో బుల్డోజ‌ర్లు బిజీగా ఉండి ఉంటాయ‌ని ఘాటుగా స్పందించారు. కాగా, నుపూర్‌ శర్మ.. మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10న ప్ర‌యాగ్‌రాజ్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌నలు చోటుచేసుకున్నాయి. ఈ నిరసనకు కారణమైన ప్రధాన వ్యక్తి ఇంటిని ప్ర‌యాగరాజ్ డెవల‌ప్‌మెంట్ అథారిటీ (పీడీఏ) కూల్చివేసిన నేప‌ధ్యంలో కార్తీ చిదంబ‌రం ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇక, రాహుల్‌ గాంధీపై ఆరోపణల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌, అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మరోవైపు.. ఇదే కేసులో జూన్ 23న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. 

ఇది కూడా చదవండి: నేషనల్‌ హెరాల్డ్‌ కేసేంటి?.. అసలేం జరిగింది?

మరిన్ని వార్తలు