‘ఆర్థిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేశారు’

1 Sep, 2020 18:38 IST|Sakshi

మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతల ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ : జీడీపీ పతనంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ విమర్శలతో విరుచుకుపడింది. నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థ విచ్ఛిన్నం ప్రారంభమైందని, ప్రభుత్వం ఆపై వరుసగా తప్పుడు విధానాలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసంలో దేశ జీడీపీ ఎన్నడూలేని విధంగా 23.9 శాతం పతనమైన విషయం తెలిసిందే. జీడీపీ-23.9..నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం మొదలవగా, ఆపై ప్రభుత్వం ఒకదాని వెంట ఒకటిగా తప్పుడు విధానాలను ప్రవేశపెట్టిందని రాహుల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రభుత్వానిదే బాధ్యతని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఆర్థిక సునామీపై రాహుల్‌ గాంధీ ఆరు నెలల కిందటే హెచ్చరించినా ప్రభుత్వం కంటితుడుపుగా ప్యాకేజ్‌ను ప్రకటించిందని, ఇప్పుడు వాస్తవ పరిస్థితి కళ్లెదుట కనిపిస్తోందని ఆమె ట్వీట్‌ చేశారు. ఇక కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా సైతం జీడీపీ పతనంపై మోదీ సర్కార్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మోదీజీ.. మీరు ఒకప్పుడు అద్భుత అస్త్రాలుగా అభివర్ణించినవి తుస్సుమన్నాయని ఇప్పుడైనా అంగీకరించండ’ని వ్యాఖ్యానించారు. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన అనంతరం ఆర్థిక వ్యవస్థ వీ ఆకారంలో కోలుకుంటోందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణ్యం అన్నారు. చదవండి : ‘చేతకాక దేవుడిపై నిందలా’

>
మరిన్ని వార్తలు