2022 నాటికి పట్టాలపైకి 44 వందే భారత్‌ రైళ్లు

29 Jul, 2020 09:08 IST|Sakshi

న్యూఢిల్లీ : రాబోయే మూడేళ్లలో 44 ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించనున్నట్లు భారత రైల్వే శాఖ మంగళవారం తెలిపింది. దేశీయ తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మూడు యూనిట్లలో తయారు చేసి వాటిని 2022 నాటికి రైలు నెట్‌వర్క్‌లో చేర్చనున్నట్లు వెల్లడించింది. అత్యాధునిక హంగులతో తయారయ్యే ఈ రైళ్లు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి రానున్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తాలా, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్‌బరేలి, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలలో ఈ వందే భారత్ రైళ్ల నిర్మాణం ఒకేసారి జరుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వికె యాదవ్ తెలిపారు. (2023లో మొదటి దశ ప్రైవేట్‌ రైళ్లు)

ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం మూడు కర్మాగారాల్లో ఈ రైళ్లను తయారు చేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా రైళ్ల నిర్మాణ సమయాన్ని తగ్గించవచ్చన్నారు. 44 వందే భారత్‌ రైళ్లు వచ్చే రెండు మూడేళ్లలో పట్టాలపైకి ఎక్కనున్నాయని తెలిపారు. టెండర్‌ ఖరారు చేయడంతో ఖచ్చితమైన సమయానికి రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. మొదటి రెండు వందే భారత్‌ రైళ్లను తయారు చేసిన ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌) రైల్వే బోర్డుకు వాటి సేవలను వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు 28 నెలలతోపాటు అదనంగా ఆరు నెలల సమయం పట్టిందని, దాని అంచనాల ప్రకారం  44 రైళ్ల తయారీని పూర్తి చేయడానికి 78 నెలలు పట్టనున్న్నట్లు పేర్కొన్నారు. (‘ట్రైన్​ 18’ నుంచి చైనా ఔట్​..!)

మరిన్ని వార్తలు