ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు!

1 Nov, 2022 16:28 IST|Sakshi

జైపూర్‌: అధికార పార్టీ నేతలపై విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేయడం సహజమే. కానీ, ప్రశంసలు కురిపించుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎప్పుడు నిప్పులు చెరిగే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌ తాజాగా ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ గ్రేట్‌ అంటూనే చురకలు అంటించారు. ఈ సంఘటన రాజస్థాన్‌ బాన్సవారా జిల్లాలోని మంగఢ్‌ హిల్‌పై నిర్వహించిన‘మంగఢ్‌ ధామ్ కి గౌరవ్‌ గాథా’ కార్యక్రమం వేదికపై కనిపించింది. వేదికపై పీఎం మోదీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఉన్నారు.  

‘పీఎం మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోతుగా పాతుకుపోయిన గాంధీ దేశానికి ఆయన ప్రధానమంత్రి. ప్రపంచం ఆ సత్యాన్ని గ్రహించి ఆ దేశానికి ప్రధాని మనల్ని కలిసేందుకు వచ్చారని గొప్పగా భావిస్తారు.’

- అశోక్‌ గెహ్లట్‌ , రాజస్థాన్‌ ముఖ్యమంత్రి.

ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులుగా అశోక్‌ గెహ్లట్‌తో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. ‘ ముఖ్యమంత్రులుగా అశోక్‌ జీ, నేను కలిసి పని చేశాం. మన ముఖ్యమంత్రుల్లో ఆయన అత్యంత సీనియర్‌. ప్రస్తుతం వేదికపై ఉన్న సీఎంలలోనూ ఆయనే సీనియర్‌.’అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రైబల్‌ కమ్యూనిటీ పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత ట్రైబల్‌ కమ్యూనిటీలకు చరిత్రలో సరైన స్థానం లభించలేదన్నారు. అలాంటి దశాబ్దాల కాలం నాటి తప్పులను తాము సవరిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల ఘర్షణ

>
మరిన్ని వార్తలు