దేశంలో ఎక్కడా జరగలేదా.. టీచర్‌ దెబ్బలకు విద్యార్థి మృతిపై సీఎం సంచలన వ్యాఖ్యలు

15 Aug, 2022 12:58 IST|Sakshi

ఉదయపూర్‌: దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. తాజాగా రాజస్తాన్‌లోని జలోర్‌ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్‌ సింగ్‌ అనే టీచర్‌ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్‌ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దీంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడిని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన జూలైన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

అయితే, ఈ ఘటనపై రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రతీ రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయన్నారు. టీవీలో, పత్రికల్లో వీటిని మనం చూస్తూనే ఉంటామని చెప్పారు. బాలుడిని కొట్టడాన్ని తాను కూడా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన సీఎం.. ఇలాంటి ఘటన ఎక్కడ జరిగినా నేరమని అన్నారు. కానీ, ఇలాంటి ఘటనలను కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా చూడటం విచారకరమని గెహ్లాట్‌ ఆవేదన వ్యక్తపరిచారు. 

కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని సీఎం తెలిపారు. బాలుడిని కొట్టిన టీచర్‌ చైల్‌ సింగ్‌(40)ను అరెస్ట్‌ చేసి సమగ్ర విచారణకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ఇంతకంటే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు వేరే పనిలేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రతీ విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: స్వాతంత్ర్య వేడుకల వేళ సోనియా సీరియస్‌

>
మరిన్ని వార్తలు