రాజస్తాన్‌ సీఎంకు టీచర్ల షాక్‌.. ‘అవును మేం లంచం ఇచ్చాం’

17 Nov, 2021 09:00 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఊహించని ఇబ్బందికర పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చింది. బదిలీలు, కొత్తగా పోస్టుల కోసం తాము స్థానిక ఎమ్మెల్యేలతో పైరవీలు చేయించుకుని, డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందంటూ సాక్షాత్తూ సీఎం పాల్గొన్న సభలో పలువురు టీచర్లు ఆరోపణలు చేశారు. టీచర్ల ఆరోపణలపై స్పందించిన సీఎం గహ్లోత్‌.. ఇది నిజమేనా అంటూ ప్రశ్నించగా ఊహించని విధంగా ‘అవును..మేం ముడుపులు ఇచ్చుకున్నాం..’అంటూ సభికుల నుంచి సమాధానం వచ్చింది. 

దీంతో నిశ్చేష్టుడైన గహ్లోత్‌.. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ హామీ ఇచ్చారు. ‘బదిలీల కోసం ఉపాధ్యాయులు లంచాలు ఇవ్వాల్సి రావడం దురదృష్టకరం. ఇందుకు సంబంధించి త్వరలో ఒక విధానాన్ని ప్రకటిస్తాం’ అంటూ ప్రకటించారు. ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కూడా గోవింద్‌ దోతస్రా కూడా ఉండటం గమనార్హం. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. 
 

మరిన్ని వార్తలు