జైపూర్ : రాజస్తాన్లొని శ్రీగంగనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే జంగిడ్ గన్మెన్, డ్రైవర్పై టోల్ప్లాజా సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వాహనం టోల్గేటును దాటుతుండగా సడెన్గా బారికేడ్ పెట్టడంతో గొడవ రాజుకుంది. ఇరు వర్గాలు మాట్లాడుతుండగానే డ్రైవర్, గన్మెన్లపై టోల్ సిబ్బంది దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఓ ప్రజాపతినిథి వద్దే ఇంత దురుసుగా ఉంటే ఇక సాధారణ ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే జంగిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ ఉద్యోగులను గుండాలుగా అభివర్ణించిన ఆయన..చుట్టుపక్కల ప్రజలు జోక్యం చేసుకోకపోతే ఇంకా పెద్ద గొడవ జరిగి ఉండేదని, తనపై కూడా దాడి జరిగే అవకాశం ఉండేదని తెలిపారు. (బెంగాల్ను గుజరాత్గా ఎందుకు మారుస్తారు: మమతా బెనర్జీ )
ఈ ఘటనకు పాల్పడినవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, టోల్ప్లాజా నడుపుతున్న సంస్థ లైసెన్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు టోల్ప్లాజాకు చెందిన ఐదుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో , కాంగ్రెస్ ఎమ్మెల్యేకే ఇలాంటి చేదు అనుభవం చోటుచేసుకోవడంతో శాంతి భద్రతల పరిస్థితి ఎంటన్న సందేహం వ్యక్తమవుతుందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.