వివాదాస్పద చట్టంపై రాజస్థాన్‌ సర్కార్‌ యూటర్న్‌

12 Oct, 2021 11:09 IST|Sakshi

జైపూర్‌: వివాదాస్పదమైన బాల్య వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయాలని చేసిన చట్టంపై రాజస్థాన్‌ ప్రభుత్వం వెనక్కుతగ్గింది. తప్పనిసరి రిజిస్ట్రేషన్ల వివాహ(సవరణ)బిల్లు-2021ను రాజస్థాన్‌లో గత నెల అసెంబ్లీలో ఆమోదించిన విషయం తెలిసిందే. మైనర్ల వివాహాలు సహా అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సవరణ చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం ద్వారా బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది.

దీంతో గవర్నర్‌ వద్ద ఉన్న ఈ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు సీఎం అశోక్‌ గెహ్లోత్‌ పేర్కొన్నారు. చట్టాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ బాల్య వివాహాలను తమ ప్రభుత్వం అరికడుతుందని సీఎం తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సవరణ చట్టాన్ని తీసుకువచ్చామని కానీ, నిరసన వ్యక్తమవటం వల్ల వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు.

నూతన చట్టం ప్రకారం 18 ఏళ్లకు తక్కువగా ఉన్న యువతలు, 21 ఏళ్లకు తక్కువ ఉ‍న్న యువకులకు సంబంధించిన వివాహాలను రిజిస్ట్రేషన్‌ చేయాలని పేర్కొంది. బల్యవివాహాలను తగ్గించాలనే ఉద్దేశంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇక రాజస్థాన్‌లో బాల్యవివాహాల సంఖ్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు